Andhra Pradesh Crime News: ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట సమీపంలో కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్ లో కన్నతల్లిని బ్లేడుతో గొంతు కోసి అత్యంత దారుణంగా కడతేర్చిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట సమీపంలో కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. తల్లి హత్యకు పాల్పడిన మృతురాలి కుమారుడు దార్ల వీరయ్యను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు పంపించినట్లు సీఐ అచ్చయ్య, ఎస్సై రాజేష్లు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. చిలకలూరిపేట మండలంలోని రాజాపేట సమీపంలో దారుణం జరిగింది. రాజాపేటకు చెందిన దార్ల వీరయ్య గత 20 సంవత్సరాలుగా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 4 సంవత్సరాల క్రితం రాజాపేట నుంచి తల్లి ఆదిశేషమ్మ(67)ను సత్తెనపల్లిలోని తన వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు.. ఆదివారం తెల్లవారుజామున తల్లి ఆదిశేషమ్మను వీరయ్య చంపాలనే ఉద్ధేశంతో.. ఆమెను మోటార్ సైకిల్పై పోతవరం గ్రామ శివారులోకి తీసుకువచ్చాడు. అక్కడ తనతో తెచ్చుకున్న బ్లేడుతో తల్లి ఆదిశేషమ్మ గొంతు కోసి పారిపోయాడు. గొంతు తెగిపోయిన ఆదిశేషమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
తీవ్రంగా గాయపడిన ఆదిశేషమ్మను స్థానికులు 108లో గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఈ హత్యకు ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.