కిర్లంపూడిలో మళ్లీ ఉద్రికత్త నెలకొంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శనివారం ఉదయం నుండి పోలీసులు భారీగా మోహరించారు. ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకా అన్నట్లుగా కిర్లంపూడిలో బలగాలు మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆత్మీయ పలకరింపు పేరిట ఈ నెల 8,9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నట్టు ముద్రగడ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి.గన్నవరం నియోజకవర్గంలో అభిమానులను ఆత్మీయంగా పలుకరించనున్నట్టు ఆయన తెలిపారు. అందుకు పోలీసులు కూడా అనుమతించారు. అయితే, రాత్రికి రాత్రి ఏమైందో అర్ధం కావటం లేదు? శనివారం ఉదయానికే పోలీసులు కిర్లంపూడిలోను, ముద్రగడ ఇంటిచుట్టూ మోహరించటం ఆశ్చర్యంగా ఉంది.
ముద్రగడ పర్యటనను అడ్డుకునేందుకే పోలీసులు కిర్లంపూడిలో మోహరించినట్లు అర్ధమవుతోంది. ముద్రగడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా పోలీసులు అనుమతి తప్పదన్నట్లుగా ఉంది ప్రభుత్వం తీరు. పోలీసుల అనుమతి తప్పని సరి అంటూ మంత్రులు చెబుతున్నారు. అయితే, లా అండ్ ఆర్డర్ సాకుతో పోలీసులు ముద్రగడకు అనుమతి నిరాకరిస్తున్నారు. అందుకనే ముద్రగడ కూడా పోలీసుల అనుమతి తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు.
ముద్రగడ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయన వ్యక్తిగత పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గతంలోనే చెప్పారు. అయినా, ముద్రగడను ఇంటి నుంచి కదలకుండా చుట్టూ పోలీసులు మోహరించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?