అమరావతి రైతులు న్యాయ దేవతను మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా.?: టిడిపి ఎమ్మెల్యే ఆగ్రహం

By Arun Kumar PFirst Published Mar 6, 2022, 2:32 PM IST
Highlights

ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా అధికార వైసిపి నాయకులు అనుచితంగా మాట్లాడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. 

అమ‌రావ‌తి (amaravati)లోనే ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌న్న రాష్ట్ర హైకోర్టు (ap high court) తీర్పు నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని (ap capital issue) అంశంపై వివాదం కొనసాగుతోంది. తాజా హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ప్రతిపక్షాలు, వ్యతిరేకిస్తూ అధికార వైసిపి నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (eluru sambashivarao) హైకోర్టు తీర్పు, వైసిపి వ్యవహారశైలిపై స్పందించారు. 

''నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి మొట్ట మొదట ప్రాణ సమానమైన భూముల్ని త్యాగం చేసి పునాది రాయి వేసింది రైతులే. ఆ రైతులు న్యాయ దేవతను మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా.? మూడేళ్లుగా మూడు రాజధానుల పేరుతో చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మింగుడు పడటం లేదు. కోర్టు తీర్పులతోనైనా బుద్ధి తెచ్చుకోకుండా నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు'' అని ఎమ్మెల్యే మండిపడ్డారు. 

Latest Videos

''అమరావతి రైతులు, మహిళల 807 రోజులుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. రూ.15 వేల కోట్లతో పనులు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేస్తే గ్రాఫిక్స్ అనడానికి మనసెలా ఒప్పింది.? రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిసినా మొండిగా ప్రవర్తించి ప్రజాధనం వృధా చేశారు. అభివృద్ధిని వికేంద్రీకరించడని ప్రజలు కోరుతుంటే పాలన వికేంద్రీకరణ చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. మూడేళ్లుగా ఎక్కడ ఏ ఉపాధి కల్పించారో వైసీపీ సమాధానం చెప్పాలి'' అని నిలదీసారు. 

''రాజధానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇంకా మానడం లేదు. అమరావతిలోని సంపదతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని మాస్టర్ ప్లాన్ లో స్పష్టంగా ఉంది. రాజధానికి టీడీపీ ప్రభుత్వం ఎన్నికోట్లు ఖర్చు చేసిందో కోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా ఉంది.  దాన్ని అమలు చేసుకోవడం వైసీపీ చేతకాలేదు. విజనరీ ఉన్నవాళ్లకు తప్ప విధ్వంసాలు సృస్టించేవారికి రాజధాని నిర్మించడం చేతకాదు'' అన్నారు. 

''189 మంది రైతుల ప్రాణత్యాగాలను వైసీపీ చులకన చేసి మాట్లాడుతోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దొంగ పత్రికలో అసత్యాలు ప్రచారం చేశారు. రాజధానిని కొసాగించి 139 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కొనసాగించి ఉంటే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించేవి. ఇకనైనా మాస్టర్ ప్లాన్ అమలు చేసి రాజధానిని నిర్మించాలి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను రోడ్ల పాలు చేశారు. మహిళలు, వృద్దులు, పిల్లలు అని చూడకుండా లాఠీచార్జ్ చేసి, అక్రమంగా ఎట్రాసిటీ కేసులు పెట్టి జైళ్ళలో నిర్భందించారు. రైతుల పాపం ప్రభుత్వానికి ఊరికేపోదు'' అని ఎమ్మెల్యే సాంబశివరావు  హెచ్చరించారు. 
 

click me!