ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 10:30 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తెలిపారు. అయితే సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభలోనే నిరసన తెలుపగా.. వారిని సభలో నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ సూచించారు. ఇక, ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్దమవ్వగా టీడీపీ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు గౌరవం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు సూచించారు. అయితే తమ హక్కులను కాపాడాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకని స్పీకర్‌పై పేపర్లను చించివేశారు.

అయితే టీడీపీ సభ్యులపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ సజావుగా  జరగాలంటే.. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పక్షంలోనే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి,  వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లగా.. మంత్రి అంటి రాంబాబు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: బాలావీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరిలపై వైసీపీ సభ్యులు దాడి చేశారు.. టీడీపీ

ఈ క్రమంలోనే శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే శాసనసభకు సంబంధించి ప్రసారాలు కూడా నిలిపివేశారు. శాసనసభ కొద్దిసేపు వాయిదా పడింది. అనంతరం శాసనసభ ప్రారంభమైన వెంటనే.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినట్టుగా స్పీకర్ తెలిపారు.

click me!