ఆంధ్రప్రదేశ్ నుంచి భర్తీ కానున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి వైసీపీ అభ్యర్ధులుగా ఇద్దు బీసీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్ద పీట వేశామని.. వైసీపీ అంటుంటే బీసీల వెన్నెముక విరగ్గొట్టిందే జగన్ అని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీలో రెడ్లకు పెత్తనమిచ్చి..బీసీలను అణగదొక్కింది జగన్ కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు పంచి పెత్తనం చేయమంటున్నారంటూ యనమల ఫైరయ్యారు. స్థానిక సంస్థల్లో టీడీపీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే.. దానిని పది శాతానికి కుదించింది వైసీపీ కాదా అని యనమల ప్రశ్నించారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని.. తాము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ పార్టీ నుంచే వెళ్లారని యనమల గుర్తుచేశారు.
కాగా.. ఏపీలో బీసీలకు మరోసారి పెద్దపీట వేశారు సీఎం జగన్ (ys jagan) . ఇప్పటికే రాజ్యసభలో (ysrcp rajya sabha candidates) వైసీపీ నుంచి ఇద్దరు బీసీ ఎంపీలు వుండగా.. తాజాగా మరో ఇద్దరిని ఎంపిక చేశారు. ఆర్ కృష్ణయ్య ( r krishnaiah), బీద మస్తాన్ రావులను (beeda mastan rao) రాజ్యసభ అభ్యర్ధులుగా ఖరారు చేశారు జగన్. దీంతో రాజ్యసభలో వైసీపీ బీసీ సభ్యుల సంఖ్య నాలుగుకి చేరింది. ఇప్పటికే కీలక పదవుల్లో బీసీలను నియమించారు సీఎం జగన్. అసెంబ్లీ స్పీకర్, ఏడు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్లు, 37 మున్సిపల్ ఛైర్మన్లు, ఆరు జడ్పీ ఛైర్మన్లు, 76 మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, 53 ప్రభుత్వ కార్పోరేషన్ ఛైర్మన్లు, బీసీల కోసమే 56 ప్రత్యేక కార్పోరేషన్లను జగన్ ఏర్పాటు చేశారు.
ALso Read:టీడీపీ- జనసేన పొత్తు : బీసీలనే నమ్ముకుంటోన్న జగన్.. ఆర్ కృష్ణయ్యతో పవన్కు చెక్ సాధ్యమేనా ..?
బీసీల తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు చెప్పారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. గతంలో ఎన్నడూ ఇలాంటి అవకాశాలు బీసీలకు దక్కలేదన్నారు. జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారని ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు సంబంధించినది కాదని.. దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నానని కృష్ణయ్య తెలిపారు. ఈ పోరాటాన్ని గుర్తించి జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పించారని కృష్ణయ్య వెల్లడించారు. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని (tdp) జగన్ మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు.