రాజారెడ్డి జమానాలో నర్సయ్య... జగన్ రెడ్డి జమానాలో సుబ్బయ్య: నిమ్మల ఆగ్రహం

By Arun Kumar PFirst Published Dec 31, 2020, 11:51 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ బిసి సెల్ నాయకులు, చేనేత వర్గానికి చెందిన నాయకులతో నిమ్మల కిష్టప్ప టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 

చేనేత కార్మికులంతా ఏకమై నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా నిలవాలని టిడిపి మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప కోరారు. వైసిపి హత్యా రాజకీయాలను ఖండించాలని... వైసిపి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, కమీషనర్ రాధ పేర్లను ఎఫ్‌ఐఆర్ లో చేర్చే వరకు నిరసనలు కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలపాలని నిమ్మల పిలుపునిచ్చారు. 

తెలుగుదేశం పార్టీ బిసి సెల్ నాయకులు, చేనేత వర్గానికి చెందిన నాయకులతో నిమ్మల కిష్టప్ప టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన అడ్వకేట్ నందం సుబ్బయ్య హత్య వైసిపి ఫాక్షన్ రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఈ దారుణానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేనేతలంతా ఏకం కావాలని... ప్రతి నియోజకవర్గంలో చేనేత కుటుంబాలన్నీ రోడ్డెక్కాలి, సుబ్బయ్య కుటుంబానికి  సంఘీభావం చెప్పాలని పిలుపునిచ్చారు.

''వైసిపి హత్యా రాజకీయాలను ఖండిస్తూ నిరసనలు తెలపాలి. సుబ్బయ్య భార్య ఫిర్యాదులో పేర్కొన్న నిందితుల పేర్లను ఎఫ్ ఐఆర్ లో చేర్చకపోవడం పోలీసుల్లో కొందరు వైసిపి నాయకులతో కుమ్మక్కుకు నిదర్శనం.  తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వైసిపి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, కమిషనర్ రాధ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి. అడ్వకేట్ సుబ్బయ్యను హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలి'' అని డిమాండ్ చేశారు. 

''చేనేతలను చంపడం రాజారెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబానికి మామూలే. అప్పుడు  పులివెందులలో చేనేత వర్గానికి చెందిన ముగ్గు గనుల యజమాని నర్సయ్యను చంపారు. ఇప్పుడు పొద్దుటూరులో చేనేత కుటుంబానికి చెందిన అడ్వకేట్ నందం సుబ్బయ్యను హత్య చేశారు. కడప జిల్లాలో చేనేతలు ఎవరూ రాజకీయంగా ఎదగకూడదనేది జగన్మోహన్ రెడ్డి నైజం. తాత రాజారెడ్డి లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. టిడిపి నాయకులను భౌతికంగా మట్టుబెట్టడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఫాక్షనిజాన్ని విస్తృతం చేస్తున్నారు'' అని విమర్శించారు.

click me!