గాల్లోంచి నేలకు దిగు జగన్.. అప్పుడే వరద కష్టాలు కనిపిస్తాయ్..: నారా లోకేష్

By telugu teamFirst Published Nov 20, 2021, 6:57 PM IST
Highlights

సొంత కడప జిల్లాలో 12 మంది మరణించి.. 30 మంది గల్లంతైనా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలతో అల్లకల్లోలమైతే నీరో చక్రవర్తిలా శాడిస్టిక్ ఆలోచనలతో సీఎం ఉన్నారని విమర్శలు చేశారు. ఏరియల్ సర్వే పేరిట గాల్లో తిరిగితే ప్రజల బాధలు  కనిపించవని, నేల మీదకు దిగి రావాలని అన్నారు.
 

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షల దాటికి వరదలు(Floods) పోటెత్తుతున్నాయి. ప్రజలు అనేక అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని, నేలకు దిగితేనే కదా జనం వరద కష్టాలు కనిపిస్తాయని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి శాడిస్టిక్ ఆనందం పొందుతున్నారని వివరించారు.

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందారని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నామని నారా లోకేష్ వివరించారు. ఇప్పుడు నీరో చక్రవర్తికి మరో రూపం జగన్ రెడ్డిని ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. తాను పుట్టిన గడ్డ, తనకు అధికారం కట్టబెట్టిన రాయలసీమ అకాల వర్షంతో అల్లకల్లోలమైతే అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. మరోవైపు అదానీతో విందులు, వాటాల చర్చలు, కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబు ముఖం చూడాలనే సైకో కోరికలతో అసలు జనం కష్టాలే పట్టవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని అన్నారు.

Also Read: వరద బాధితులకు సహాయం చేయండి.. కదలి రండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

సీఎం జగన్ వాతావరణ హెచ్చరికలకూ అప్రమత్తం కాకపోవడం వల్లే రాయలసీమలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు వేయించడంపై ఉన్న శ్రద్ధ ముపు బాధితులపై లేదని నారా లోకేష్ మండిపడ్డారు. సొంత కడప జిల్లాలో 12  మంది చనిపోయి 30 మంది గల్లంతైనా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి? అని ప్రశ్నించారు. గల్లంతైన వారి ఆచూకీ తెలియక కుటుంబీకులు ఆందోళనలు, నీట మునిగిన గ్రామాలు, నిరాశ్రయులైన ప్రజలు, ప్రాణ, ఆస్తి నష్టం, మూగ జీవాల మృత్యువాతలతో రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో కనిపించే విషాద దృశ్యాలని ఆయన ఓ ప్రకటనలో వివరించారు. ఈ విషాదాలు గాల్లో తిరిగితే ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. అందుకే నేల మీద దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగితే ఈ కష్టాలు కనిపిస్తాయని సూచనలు చేశారు. అందుకే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ఆ కష్టాలు చూడాలని కోరారు. 

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధికారులు సహాయ పడతారని ఆశగా ఎదురు చూడటం వృథా అని నారా లోకేష్ అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుదుద్, తిత్లీ వంటి మహా విలయాల సమయంలోనూ బాధితులకు అండగా నిలిచామని చెప్పారు. ఇప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. టీడీపీ, ఇతర అనుబంధ విభాగాలు వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సాయం చేయాలని ఆయన కోరారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు.

Also Read: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (వీడియో)

రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ జిల్లాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉన్నదని తెలిపారు. భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న జిల్లాల్లో టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపు ఇచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని సూచించారు. పసిపిల్లలకు పాలు, బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలు అందించి ఆకలి తీర్చాలని అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్, టీడీపీ, ఐటీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆహారం, మందులు పంపిణీ జరుగుతున్నదని వివరించారు. క్షేత్రస్థాయిలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు.

click me!