రాష్ట్రంలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రులు దొంగలే దొంగలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో వైసీపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రులు దొంగలే దొంగలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని... వైసీపీ నేతలు ఆలీబాబా నలభై దొంగల ముఠా అని రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకం భావిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. నారా లోకేష్ పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రవికుమార్ మండిపడ్డారు.
''టిడిపి వికెట్లు పడిపోతున్నాయని మంత్రి అనిల్ కుమార్ అనే ముందు వైసీపీ వికెట్లు పడకుండా చక్కదిద్దుకొండి. మీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటన చూడండి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా దండుకుంటున్నారో ఆయనే స్వయంగా చెప్పారు'' అని అన్నారు.
''సోమశిల నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు అమ్ముకున్న అనిల్ కుమార్ కు లోకేష్ ను విమర్శించే అర్హత లేదు. నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ చేతకాని దద్దమ్మ. శాండ్, వైన్, మైన్ మాఫియానే కాదు నీళ్ళ మాఫియ కూడా ఉంటుందని అనిల్ నిరూపించాడు. వైసీపీ నేతలు పంచభూతాలను కూడా వదిలిపెట్టారు'' అని మండిపడ్డారు.
''వైసీపీకి చెందిన 151 ఎమ్మెల్యేలలో 76 మందిపై కేసులున్నాయి. గురివింద సామెత మాదిరి వారిపైనే కేసులు పెట్టుకున ఇతరులపై బురద జల్లుతున్నారు. అన్ని రంగాల్లో వైసీపే ప్రభుత్వం విఫలమైంది. పేదవాడి మనసు దోచుకోవడంలో విఫలమయ్యారు. భవిష్యత్తులో వైసేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని హెచ్చరించారు.
read more వైఎస్సార్ నేతన్న నేస్తం వాయిదా... జగన్ సర్కార్ ప్రకటన
'' శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం ఆన్ లైన్ లో తప్పితే ఎక్కడా ఇసుక దొరకని పరిస్థితి. అన్ని జిల్లాల్లోనూ ఇదే రకంగా ఇసుక దోపిడీ జరుగుతోంది. ఉచిత ఇసుక పాలసీలో అందరికీ ఇసుక అందుబాటులో వుండటం చంద్రబాబు సమర్థ పాలనకు నిదర్శనం'' అని అన్నారు.
''ఏడాది కాలంలో నీతి పారుదల శాఖ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లకపోయి, రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోయినందుకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో వైసీపీ దోపిడీలను ప్రశ్నిస్తారన్న భయంతోనే బీసీ నాయకుడు గొంతు నొక్కాలని అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. కేసులు పెట్టవద్దని తెదేపా మాట్లాడటం లేదు. అవినీతి ఎక్కడ,ఏ రూపంలో జరిగినా టిడిపి ఖండిస్తుంది. రాష్ట్రంలో రాజకీయ కక్ష, అరాచకాలు, గూండా గిరి ,రాక్షస పాలన, ఫ్యాక్షన్ పాలన కొనసాగించాలనే అచ్చన్నపై అక్రమ కేసులు బనాయించడం వల్లే తిరగబడుతున్నాం'' అని వెల్లడించారు.
''ఎన్ని అక్రమ కేసులు పెట్టినా దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎండ గడతాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో మంత్రులు, శాసనసభ్యులు దోచుకున్న వైనాన్ని ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ నేతలు దోచుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేసి ప్రజానీకానికి తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. క్యాస్ట్రో ఆనాడే ''అవినీతిపరులది అధికారమైతే నీతిమంతులు జైలులోనే ఉండాలి'' అన్నారని... జగన్ లాంటి వారు నాయకులుగా చలామణి అవుతారని ఆయన ముందుగానే ఊహించినట్లున్నారు'' అని రవికుమార్ విమర్శించారు.