కరోనా ఎఫెక్ట్: టీడీపీ కార్యాలయం మూసివేత, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్

By Siva KodatiFirst Published Mar 20, 2020, 9:06 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని నరేంద్రమోడీ సూచనల మేరకు ఎన్టీఆర్ భవన్‌కు సందర్శకులు, కార్యకర్తలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

టీడీపీ కార్యకర్తలు, నేతలు కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ కార్యాలయ సిబ్బంది కూడా ఇంటి నుంచే పనిచేయాలని ప్రతిపక్షనేత ఆదేశాలు జారీ చేశారు.

Also Read:కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే

ఏదైనా సమాచారం ఉంటే నేతలు, కార్యకర్తలు వాట్సాప్, ఫోన్ల ద్వారా అందించాలని చంద్రబాబు సూచించారు. ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలతో మమేకం అవుతుందని టీడీపీ అధినేత ట్వీట్టర్‌లో తెలిపారు.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... వైరస్ వ్యాప్తి, నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలు మూసివేత కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్ధితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని జగన్ తెలిపారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కరోనావైరస్ కట్టడికి పవన్ కల్యాణ్ చిట్కాలు

కరోనా పేరు చెప్పి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని, బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా..? లేదా..? అనేది చూడాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో పారాసిటమాల్ ఇతర యాంటిబయాటిక్స్ సిద్ధంగా ఉంచుకోవాలని జగన్ ఆదేశించారు.

వైద్య ఆరోగ్య సిబ్బందిని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని.. పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో ఖచ్చితంగా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. 

click me!