
అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు, వివాదాస్పదుడు రామ్గోపాల్ వర్మకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ముక్కుసూటిగా సవాల్ చేశారు. దమ్ముంటే టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర దర్శకుడు రామ్గోపాల్ వర్మ షూటింగ్ తీయడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
పవిత్ర సంగమం వద్ద దేవినేని ఉమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీవీపై ఫైర్ అయ్యారు. పట్టిసీమ పథకం దండుగ అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని అన్నారు. అలాంటప్పుడు మరేం ముఖం పెట్టుకుని ఇక్కడ షూటింగ్ చేయించడానికి ఆర్జీవీని పంపించారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టిసీమ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం మెయింటెయింనెన్స్ కూడా చేయలేదని దుయ్యబట్టారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టిసీమ ప్రాజెక్టును ఉపయోగించారని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకుని పట్టిసీమ వద్దకు వచ్చారని అడిగారు. ప్రజలకు ఏం ముఖంతో సమాధానం చెబుతారని నిలదీశారు.
Also Read: గుడివాడలో మహిళా వాలంటీర్ ఆత్మహత్య యత్నం.. మరో వాలంటీర్పై ఆరోపణలు..!
కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే పట్టిసీమను పూర్తి చేసి సుమారు 13 లక్షల ఎఖరాలకు సాగు నీరు ఇచ్చిన ఘటన టీడీపీదేనని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తామని చెప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులపై పవర్ ప్రెజెంటేషన్ ఇస్తే ప్రపంచమంతా చూసిందని వివరించారు. దర్శకుడు రామ్గోపాల్ వర్మకు దమ్ముంటే టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు.