వారితో సీఎం కనీసం మాట్లాడకపోవడం...గుట్టు బయటపడుతుందనేనా?: చంద్రబాబు ఆగ్రహం

By Arun Kumar PFirst Published May 19, 2020, 9:43 PM IST
Highlights

గ్యాస్ లీకేజీ ఘటనలో తమ గ్రామానికే అధికంగా అన్యాయం జరిగినా ప్రభుత్వం మాత్రం తగిన న్యాయం చేయడంలేదని వెంకటాపురం గ్రామస్తులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పందించారు. 

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ వద్ద మంగళవారం ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ కంపనీ ముందు కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఎక్కువగా నష్టపోయిన తమ గ్రామానికి తగిన న్యాయం జరగడంలేదంటూ వెంకటాపురం గ్రామస్తులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంపై తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. 

''ఒక దుర్ఘటన జరిగాక బాధితులకు భవిష్యత్తు పట్ల భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. లాలూచీ రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలు ఇలాగే రోడ్లెక్కుతారు. ఎల్జీ పాలిమర్స్ దగ్గరున్న వెంకటాపురం గ్రామస్థులు ప్రత్యేక ప్యాకేజీ కావాలని మొదటి నుంచీ అడుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు?'' అంటూ సోషల్ మీడియా వేదికన ప్రశ్నించారు.    

''విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో కంపెనీకి 5 కి.మీ. పరిధిలోని గ్రామాల ప్రజలందరూ నరకం చూసారు. వెంకటాపురం గ్రామంలో మరింత ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. అలాంటి గ్రామస్థులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో ఎందుకు అవకాశం కల్పించలేదు? మీ గుట్టుమట్లేమైనా బయటపడతాయనా?'' అంటూ నిలదీశారు. 

''వెంకటాపురం గ్రామస్థులు కోరుతున్నట్టుగా గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. తాత్కాలిక ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలి. గ్రామంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి. 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సంస్థతో ఇప్పించాలి'' అని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

read more ఎల్జీ పాలిమర్స్ కు 219 ఎకరాలు, రూ.2,500కే...ఆ అనుమతులూ వైఎస్ ఇచ్చినవే: చంద్రబాబు

ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్  ఫ్యాక్టరీ నుండి స్టైరైన్ గ్యాస్ లీకైంది. దీంతో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు అస్వస్థతకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందించింది.

అయితే వెంకటాపురం గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని ఇవాళ ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొన్నారు. ఈ గ్యాస్ ప్రభావంతో ఇతర గ్రామాల కంటె తమ గ్రామమే ఎక్కువ నష్టపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇతర గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని వెంకటాపురం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులతో గ్రామస్తులు  వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఎల్జీ పాలీమర్స్ బాధిలుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్యాస్ లీకేజీ బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హామీ ఇచ్చారు. అంతేకాదు బాధిత గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు జారీ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

click me!