
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న దారుణాలను... మరీముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా జరిగిన ఘటనలను డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి (kasireddy rajendranath reddy) దృష్టికి తీసుకెళ్లారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu). రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల గురించి వివరిస్తూ చంద్రబాబు డిజిపికి లేఖ రాసారు. నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం గురించి తెలుపుతూ, నిందితులపై కఠిన చర్యలు డిమాండ్ చేస్తూ లేఖ రాసారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను కూడా డిజిపికి రాసిన లేఖకు జతచేసారు.
''రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యింది. ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైంది. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. పెట్రేగుతున్న వైసిపి గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతుంది'' అని చంద్రబాబు ఆరోపించారు.
''పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. తన భర్త హత్యకు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడి భార్య చెప్పింది. ఇక శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
''రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకమే కారణం అవుతున్నాయి. గంజాయి సరఫరాలో అధికార వైసిపి నేతల ప్రమేయం కనిపిస్తోంది. అయినప్పటికి పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదు'' అన్నారు.
''అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ పరిధిలో వైసిపి నాయకున్ని పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చేసాడు. ఇది పోలీస్ శాఖలో పరిస్థితికి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎపి పోలీసులు స్పందించకున్నా....కర్నాటక పోలీసులు వైసిపి ఎంపిటిసిని అరెస్టు చేశారు'' అన్నారు.
''తాజాగా ఏపి నుంచి అస్ట్రేలియాకు డ్రగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయి. నేరాలు చేసే నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా తయారవడంపై పోలీస్ శాఖ దృష్టిపెట్టాలి'' అని డిజిపికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.