
అమరావతి: స్వామి వివేకానంద జయంతి (swamy vivekananda jayanthi) కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు (nara chandrababu naidu) నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డే (national youth day) గా జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి అర్పిస్తూ...యువతకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లే....నిత్యం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుందన్న సందేశం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. లేవండి...కదలండి...గమ్యం చేరే వరకు ప్రయత్నం ఆపకండి అనే వివేకానందుని మాటతో రాష్ట్రంలో అరాచక పాలనపై యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసిపి (ysrcp) ప్రజా వ్యతిరేక పాలనతో యువత భవిష్యత్ అంధకారం అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక రాష్ట్రం లో 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో యువత భవితకు భరోసా ఇచ్చేలా.... వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగ, ఉఫాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రత్యక్ష్యంగా... పరోక్షంగా 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ పాలనలో రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి 17,591 ఉద్యోగాలు ఇస్తే.....ప్రతి ఏటా డీఎస్సీ జరుపుతామని చెప్పిన జగన్ రెడ్డి కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే నేటి సీఎం జగన్ రెడ్డి దాన్ని రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. నాడు ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల విప్లవం అన్న మాటలు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్, నాసికరం మద్యానికి నిలయంగా మార్చి యువత భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. యువత తలచుకుంటే దేన్నైనా సాధించవచ్చన్న స్వామి వివేకానంద స్పూర్తితో వైసీపీ అసమర్ద, అవినీతి, అరాచక పాలనపై యువత పోరాటం చేయాలని చంద్రబాబు నేషనల్ యూత్ డే సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇక వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకొని బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో కూడా జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానందుని చిత్రపటానికి నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సంధర్బంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ... యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న స్వామి వివేకానంద జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టమన్నారు ఏ దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని... యువజనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన... ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారన్నారు.
లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలని, విజయానికి అసలు రహస్యం ఇదేనని టిడి జనార్ధన్ అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదనేది ఆయన భావన అని... ఇలాంటి భోధనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా యువత తమ లక్ష్యసాధన వైపు అడుగులు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంజి చిరంజీవి, బుచ్చి రాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సయ్యధ్ రఫీ, దొన్ను దొర, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, విశ్వనాధ నాయుడు, దారపనేని నరేంద్ర బాబు, వల్లూరి కుమార స్వామి, వట్టికుంట భాను తధితరులు పాల్గొన్నారు.