అధికారం ప్రజలను చంపడానికి లైసెన్సా: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

By Siva KodatiFirst Published Oct 13, 2020, 7:11 PM IST
Highlights

దేశంలో ఎన్నడూ చూడని దుర్మార్గ పాలనను ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.  పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

దేశంలో ఎన్నడూ చూడని దుర్మార్గ పాలనను ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.  పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నేరచరిత్రగల వాళ్లు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చకోడానికి ఇంకా పెద్దతప్పు చేయడం జగన్మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయ్యిందని చంద్రబాబు మండిపడ్డారు.

ఇచ్చిన అధికారం ప్రజలను చంపడానికి లైసెన్స్ అనుకుంటున్నారా..? అని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అవినీతి బురద ఇతరులకు అంటించడం, తప్పుడు వార్తలతో ప్రజల్లో అపోహలు పెంచడం జగన్ నైజమని చంద్రబాబు ఆరోపించారు.

ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడం, బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం ఆయన రాజకీయమన్నారు. గత 2 రోజులుగా భారీ వర్షాలతో 5జిల్లాలు అతలాకుతలం అయ్యాయని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగిందని ఆయన చెప్పారు. అటు కరోనా బాధితులను, ఇటు వరద బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులంతా వ్యతిరేకిస్తున్నారని, రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని ఆయన నేతలకు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

click me!