చంద్రబాబును పెద్దూరు వద్ద అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత..

Published : Jan 04, 2023, 04:40 PM ISTUpdated : Jan 04, 2023, 05:09 PM IST
చంద్రబాబును పెద్దూరు వద్ద అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత..

సారాంశం

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గం చేరుకున్నారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గం చేరుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కుప్పంకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే తన కారులో నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే రాష్ట్రంలోని రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు చంద్రబాబు కొద్దిదూరం ముందుకు కదలగానే.. పోలీసులు ఆయన వద్దకు చేరుకున్నారు. రోడ్లపై ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు రోడ్ షోను నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వాహనం నుంచి కిందకుదిగారు. తర్వాత  చంద్రబాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పర్యటనుకు ఎందుకు అనుమతి ఇవ్వరో సమాధానం చెప్పాలని, రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పోలీసులను కోరారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నాయి.

ఇప్పటికే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు రోడ్‌షో, సభకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేసి ఆందోళనకు దిగారు. తమపై పోలీసులు లాఠీచార్జీ చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే తాము లాఠీచార్జీ చేయలేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాటలో కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.  తమ ఎమ్మెల్యే తమ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడమేమిటని టీడీపీ కార్యకర్తలు  ప్రశ్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu
ముద్రగడ గొడవ తర్వాత : Nara Lokesh Reaction | Bonda Uma | Asianet News Telugu