పోలీసులపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జోవో వచ్చాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తాను తల్చుకుంటే నాడు పులివెందులకు జగన్ వెళ్లేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత కొనసాగుతూనే వుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లెలో రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోవో వచ్చాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా.. తాను మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీరే చెబుతారా అంటూ ఆయన నిలదీశారు. తాను తల్చుకుంటే నాడు పులివెందులకు జగన్ వెళ్లేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమని.. తాను తిరిగితే ప్రజల్లో మీపై తిరుగుబాటు వస్తుందన్నారు.
మీరు ఎంత ఆపితే ప్రజలు అంతగా తిరగబడతారని ఆయన మండిపడ్డారు. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టగలుగుతారని.. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం తనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల అరాచకం వెనుక సైకో సీఎం వున్నాడంటూ ఆయన ఆరోపించారు. పోలీసులూ ..మీకు మానవత్వం వుందా అని చంద్రబాబు దుయ్యబట్టారు. తనను తన నియోజకవర్గంలో నడిపించడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఒక రూల్.. మాకో రూలా అంటూ ఆయన దుయ్యబట్టారు. ఏపీలో సైకో రెడ్డి పాలన కొనసాగుతోందని.. తన ప్రచార రథం తనకు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ALso Read: పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో.. ఇది బిగినింగ్ మాత్రమే.. కుప్పంలో కప్పం కట్టాలా? : చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెట్టారని.. మూడు రోజులుగా పోలీసుల అరాచకాలను చూస్తున్నామని ఆయన అన్నారు. బానిసలుగా బతకొద్దని పోలీసులకు ఆయన సూచించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. తనను పంపేయాలని చూస్తే మిమ్మల్నే పంపేస్తానని ఆయన సూచించారు. ప్రజలు తిరగబడే పరిస్ధితి తెచ్చుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు.