
న్యూఢిల్లీ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు అప్పులు చెల్లించే పరిస్థితి లేదని.. అందుకే చేబదుళ్ల మీద రోజులు నెట్టుకొస్తోందని రాసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏపీకి అదనపు రుణాలకు అనుమతిని ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేజేతులా నాశనం చేసినవారవుతారని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు.
ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్కు ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ‘బహిరంగ మార్కెట్ నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.46 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే అనుమతిని ఇచ్చారు. ఇధి విదేశీ రుణాలు, నాబార్డు, ఇతర కేంద్ర ప్రభుత్వ అప్పులకు అదనం.
ఈ కొత్త రుణాలతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణం రూ.9,03,436.58 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 75%కి సమానం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షికాదాయం రూ.1.50 లక్షల కోట్లు ఉంది. అంతేకాదు రుణం-వడ్డీల కింద రూ.55 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో.. రాష్ట్ర రెవెన్యూ లోటు త్వరలో రూ.50 వేల కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, కాగ్ ఖాతా పుస్తకాల్లో ఈ వాస్తవాలు కనిపించడంలేదని దీనికి కారణం.. ప్రభుత్వం చేసే భారీ ఖర్చులను ఎస్పీవీలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థల ఖాతాల్లో చూపి రెవెన్యూలోటును దాచిపెడుతున్నాయని.. అందుకే లెక్కల్లో కనిపించడం లేదని అన్నారు. ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల ద్వారా 2022 మార్చి 31 నాటికి రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెటేతర రుణాలు తీసుకొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఏపీ నాన్కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసింది. దీనివల్ల స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.8,305 కోట్ల వరకు అప్పు తెచ్చింది. దీంతోపాటు ఇతరత్రా మార్గాల్లో ఇంక మరో రూ.12 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇప్పటికే పరిమితులకు మించి అప్పు చేసినందున ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల నుంచి చేసిన అప్పులను సర్దుబాటు చేసేవరకూ ఏపీకి కొత్త అప్పులకు అవకాశం ఇవ్వొద్దు’ అని రఘురామకృష్ణరాజు లేఖలో తెలిపారు.