పేర్లు రాసి పెడుతున్నా... ప్రతి లెక్కా తేలుస్తా.. ఎవ్వరినీ వదిలిపెట్ట..: వైసిపి నాయకులకు చంద్రబాబు వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 6, 2022, 4:59 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ అధికార వైసిపి నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

చిత్తూరు: తన సొంత నియోజకవర్గం కుప్పం (kuppam) లో పర్యటిస్తున్న టిడిపి (TDP) జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. నియోజకవర్గంలోని టిడిపి క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు. టిడిపి శ్రేణులనే కాదు ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నానని ...అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరించారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని గుర్తిస్తే మంచిదని వైసిపి నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. 

కుప్పం మండలపరిధిలోకి దేవరాజపురానికి చేరుకున్న చంద్రబాబుని టీడీపీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తా... కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. తాను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించానని   చంద్రబాబు పేర్కొన్నారు. 

''వైసిపి (YCP) పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై తీవ్ర భారం పెరిగింది. మన పొరుగునే ఉన్న రాష్ట్రంలో పెట్రోలు ధర 10 రూపాయలు తక్కువగా ఉంది. అలాంటిది ఇక్కడెందుకు సామాన్యుల భారం తగ్గించడం లేదు'' అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసారు. 

read more  కుప్పంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్... నేటి నుండి మూడురోజులు అక్కడే, పర్యటన వివరాలివీ...

''ఎవడబ్బసొమ్మని ఓటిఎస్ (One Time Settlement)కు రూ.10 వేలు కట్టమని అడుగుతున్నారు. డబ్బుల కోసం వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించిఇస్తాం'' అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

''చివరకు వైసిపి నాయకులు, పాలకులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడినైన నన్ను కూడా కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని... కానీ అది మన విధానం కాదు. మేము అనుకుంటే ఇంట్లోంచి బయటకు రాలేరు'' అని హెచ్చరించారు. 

''ఇటీవల కుప్పంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు నన్ను బాధించాయి. మొన్నటి ఎన్నికల ఫలితాలు నన్నెంతో బాధపెట్టాయి. కుప్పంలో డబ్బులు పంచే పరిస్థితి ఎప్పుడూ లేదు. వెయ్యి, రెండు వేల పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ. కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే....మిమ్మల్ని అన్నట్లు కాదా? మనం కూడా ప్రలోభాలకు లొంగిపోతే ఎలా?'' అని చంద్రబాబు ప్రజలను నిలదీసారు. 

''కుప్పంలో మనం అంతా ఏకం ఐతే పోలీసులు ఏమి చెయ్యగలరు. ఇక్కడి కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటా. మీరు వద్దన్న నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించను.  పార్టీలోని కోవర్టులను పంపించి ప్రక్షాళన చేస్తా'' అని చంద్రబాబు  ప్రకటించారు.

read more  సీఎం గారూ... పోలవరం నిర్వాసితులకు ఆదుకొండి..: జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ

''నేను కుప్పానికి ముద్దు బిడ్డను... ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికీ పోను. కానీ అవతలివాళ్లు కుప్పంపై హేళన చేస్తే నాకు బాధకలిగింది. నేను నియోజకవర్గం మార్చాలా...? ఆ అవసరం ఉందా?'' అని ప్రశ్నించారు. 

''కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును సభలో చూడాలని సీఎం జగన్ అన్నాడు. చివరికి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి ఆనందం పొందుతారా. మళ్ళీ సీఎంగానే శాసనసభకు వెళ్తా అని చెప్పాను. సభా గౌరవం కాపాడుతా'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

''ప్రతిపక్షం పట్ల తమిళనాడులో స్టాలిన్ ఎంత గౌరవం గా ఉన్నారు...ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కు నేను అండగా ఉంటా... ఏ కార్యకర్తపై ఒక్క దెబ్బపడినా నాపై పడినట్లే'' అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.  


 

click me!