తెలుగు ప్రజలకు టిడిపి చీఫ్ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారి లోగిళ్లు సంక్రాంతి (sankranthi festival) శోభతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) లో బోగిమంటల వెలుగులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలుగుప్రజలంతా సంక్రాంతి–భోగి (bhogi) పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) పేర్కొన్నారు. ఈ సంక్రాంతి ప్రతి తెలుగు లోగిలిలో కొత్త వెలుగులు నింపాలంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
''ఇది ప్రకృతితో అనుసంధానమైన రైతుల పండుగ... ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ఎన్ని ఇబ్బందులున్నా నిరుపేదలు కూడా పెద్దపండుగను ఆనందంగా జరుపుకోవాలని భావించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకను అందజేశాం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా పేదల ఆనందం కోసం కానుకను అందజేసేందుకు వెనుకాడలేదు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
''వైఎస్ జగన్ (ys jagan) అధికారంలోకి వచ్చాక ఆ కానుకను రద్దుచేయడమేగాక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి పేదలు కనీసం మూడుపూటలా పొట్టనింపుకోలేని దుస్థితి కల్పించారు. ఎన్ని ఇబ్బందులున్నా కరోనా నిబంధనలను పాటిస్తూ తెలుగు ప్రజలంతా ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నా'' అని చంద్రబాబు అన్నారు.
ఇదిలావుంటే జనసేన పార్టీ (janasena party) అధ్యక్షులు పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతలతో పాటు జనసైనికులు, వీర మహిళలు కూడా సుఖసంతోషాలతో పండగ జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.
టిడిపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కూడా తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాల కాంతిని వెదజల్లే భోగిమంటలు మన కష్టాలను హరించాలి... తెలుగువారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
''పనికిరాని వాటిని, కీడు కలిగించే వాటిని తగలబెట్టి... కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ. వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుంది. అప్పుడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయి'' అని లోకేష్ పేర్కొన్నారు.