ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

By Siva KodatiFirst Published Mar 2, 2021, 5:45 PM IST
Highlights

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్‌ పొడిగింపుపై సర్వీస్‌ నిబంధనలు చూపించాలని జస్టిస్‌ ఎంఎం ఖన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, సీనియర్ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్‌ పొడిగింపుపై సర్వీస్‌ నిబంధనలు చూపించాలని జస్టిస్‌ ఎంఎం ఖన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్‌ 3-1సీ కింద సస్పెన్షన్‌ పొడిగించామని కోర్టుకు తెలియజేశారు. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరునెలల తర్వాత పొడిగించినట్లు వెల్లడించారు. 

అయితే ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి ఛార్జ్‌ లేదని.. రూల్‌3లోని 1బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువగా సస్పెన్షన్‌ ఉండటానికి వీల్లేదని ఆయన తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు.

అలాంటప్పుడు రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్‌ చేయలేదని ఏబీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేసేందుకు ఆయన మూడు రోజులు గడువు కోరగా.. న్యాయస్థానం అనుమతించింది.

రివ్యూ కమిటీ ఆదేశాలపై సవాల్‌ చేసిన మూడురోజుల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.  

ఏబీ వెంకటేశ్వర్రావు.. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఆ తర్వాత రక్షణ పరికరాల టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

click me!