అమరావతిపై కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 1:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాజధాని నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాజధాని నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. ఇక, గతంలో అమరావతి నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వం అయితే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నలు సంధించింది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించినట్టుగా  కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించడంపై సుప్రీం కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 

click me!