
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ భారీ పెట్టుబడులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన ఔషధ దిగ్గజం సన్ ఫార్మా (sun pharma) సిద్దమయ్యింది. ఏపీలో సన్ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు సన్ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి (dileep shanghvi) ప్రకటించారు.
మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) ను ఎండీ దిలీప్ షాంఘ్వీతో పాటు సన్ ఫార్మా ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సన్ ఫార్మా అధినేత షాంఘ్వీని శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందజేసారు సీఎం జగన్.
Video
అనంతరం సన్ ఫార్మా అధినేత, ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
read more ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో:హీరో నానికి మంత్రి పేర్ని నాని కౌంటర్
సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడంద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం వారికి వెల్లడించారు.
ఈ భేటీ అనంతరం సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ సీఎంను ప్రశంసిస్తూ రాష్ట్రంలో సన్ ఫార్మా ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసారు. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్గా దీన్ని తీసుకొస్తామని... ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని వెల్లడించారు.
''ముఖ్యమంత్రి జగన్ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లమీద ఆయనకున్న అవగాహనకు నేను ముగ్దుడినయ్యాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ఆయన విధానంగా స్పష్టమవుతోంది'' అన్నారు.
''పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవనవరులను తయారు చేయడంద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారు. తమ కంపనీ తరఫున తాము కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తాము'' అని షాంఘ్వీ పేర్కొన్నారు.
read more సంక్షేమ పథకాల అమల్లో వివక్ష లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్
''ఇప్పటికి సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పి మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఆ తర్వాత కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేయడానికి అధికారులతో మా సంప్రదింపులు నిరంతరం కొనసాగిస్తాం. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం జగన్ ఇస్తామన్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాము. ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్పై మాట్లాడుకున్నాం'' అని దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు.
జనరిక్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా సన్ ఫార్మాకు ప్రత్యేక గుర్తింపు వుంది. హెల్త్కేర్ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ సన్ ఫార్మా. 100కు పైగా దేశాల్లో సన్ఫార్మా మందులు వినియోగం, 36 వేల మందికి పైగా ఉద్యోగులు వున్నారు.