
నెల్లూరు : మానవ సంబంధాల కంటే ఆర్ధిక సంబంధాలకే తనకు ఎక్కువని భావించిన ఓ కసాయి కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. నవమాసాలు మోసిన కన్నతల్లిని, అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని కేవలం ఆస్తి వివాదాల నేపథ్యంలో చంపడానికి ప్రయత్నించాడు. సుఫారీ హంతకులతో తల్లిదండ్రులను చంపడానికి కన్నకొడుకు చేసిన కుట్ర బయటపడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కావలి తుపాన్ నగర్ కు చెందిన బాలకృష్ణయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. పిల్లలిద్దరికీ పెళ్లిల్లు కావడంతో కుటుంబ బాధ్యతలు వారికే అప్పజెప్పి ఆస్తిని కూడా ఇద్దరికీ పంచాడు. అయితే తండ్రి ఆస్తి పంపకాల విషయంలో తనకు అన్యాయం చేసాడని పెద్దకొడుకు లక్ష్మీనారాయణ భావించాడు. తమ్ముడికే ఎక్కువగా ఆస్తి ఇచ్చాడని తండ్రిపై కోపాన్ని పెంచుకుని నిత్యం గొడవపడేవాడు.
తనకు అన్యాయం చేసారని తల్లిదండ్రులపై పెంచుకున్న కొడుకు కోపం చివరకు వారిని హత్యకు కుట్రపన్నే స్థాయికి చేరింది. తల్లిదండ్రులిద్దరినీ చంపి వారిపేరిట వున్న ఆస్తికూడా తానొక్కడినే కాజేయాలని లక్ష్మీనారాయణ భావించాడు. దీంతో తన స్నేహితుడి సాయంతో తల్లిదండ్రుకల హత్యకు సుఫారీ గ్యాంగ్ తో కుట్రపన్నాడు. పాత నేరస్తుడు షఫివుల్లా ను సంప్రదించి తల్లిదండ్రులను చంపేందుకు రూ.5 లక్షలతో బేరం కుదుర్చుకుని రూ.90 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అలాగే తనకు ప్రాణంపోసిన వారి ప్రాణాలు తీసేందుకు కత్తులు కూడా సమకూర్చాడు. దీంతో షఫివుల్లా మరో ఇద్దరు నేరస్తులు గౌస్ బాషా, షేక్ షాహుల్ తో కలిసి బాలకృష్ణయ్య దంపతుల హత్యకు రెక్కి నిర్వహించి అదును కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు బుచ్చిరెడ్డిపాళెం పరిధిలో దొంగతనాలు ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలోకి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాతనేరస్తులపై నిఘా పెట్టగా షేక్ గౌస్ బాషా, షాహుల్ ఈ దొంగతనాలకకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని పట్టుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా దొంగతనాలతో పాటు సుఫారి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులు బాలకృష్ణయ్య దంపతులకు విషయం తెలియజేసారు. దీంతో దంపతులు కావలి పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్ష్మీనారాయణతో అతడి స్నేహితుడు సుబ్బారావు, కిరాయి హంతకుడు షఫివుల్లాను అరెస్ట్ చేసారు.