12 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్.. ఫోన్లో చిత్రీకరణ..డబ్బుల కోసం బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేశారు. దీంతో ముగ్గురు మైనర్ బాలురలను పోలీసులు అరెస్టు చేశారు.
పిల్లలపై సినిమాల ప్రభావంపై ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడం. దీంతో సోషల్ మీడియాకు మరింత చేరువ అవడంతో వక్రమార్గం పడుతున్న పిల్లల్ని కనిపెట్టడంలో తల్లిదండ్రులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా ఒడిశా రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో అప్లోడ్ చేసిన ఆరోపణలపై ముగ్గురు మైనర్ బాలురును అరెస్టు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. జెనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో కొద్దిరోజుల క్రితం ఓ బాలిక (12) వీధిలో ఆడుకుంటోంది. బాలికను గమనించిన అదే గ్రామానికి చెందిన 14- 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అక్కడికి వచ్చారు. బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఆ బాలురు తమ మొబైల్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు.
కొన్ని రోజులకే నిందితులు వీడియో క్లిప్ను ఉపయోగించి బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. రూ. 20,000 ఇవ్వకపోతే వీడియోను బహిర్గతం చేస్తామనీ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు.ఆ బాలిక అంత మొత్తంలో డబ్బు చెల్లించడానికి నిరాకరించడంతో.. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఈ దుశ్చర్యతో భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను విచారించారు. తర్వాత ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి పరీక్షలు నిర్వహించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా.. ముగ్గురు బాలురపై IPC, POCSO చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసామని జెనాపూర్ పోలీస్ స్టేషన్ ఐఐసి ఉమాకాంత్ నాయక్ తెలిపారు.