అమరావతి సెగ: సీఎం జగన్ నివాసం వద్ద హై అలర్ట్

By Arun Kumar PFirst Published Jun 19, 2021, 8:40 AM IST
Highlights

ఇప్పటికే తాడేపల్లి పరిసరాల్లో కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకుంటామని స్థానికులను హెచ్చరించిన పోలీసులు భద్రతను పెంచారు. 

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. అమరావతి రైతుల దీక్ష రేపటితో(ఆదివారం) 550 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించే అవకాశం వుందన్న సమాచారంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే నిరసనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు. 

ఇప్పటికే తాడేపల్లి పరిసరాల్లో కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు  తీసుకుంటామని పోలీసులు స్థానికులను హెచ్చరించారు. అంతేకాకుండా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. 

read more  వైఎస్ జగన్ బండారం బయటపెడ్తా, బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు

వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిననాటి నుండి రాజధాని రైతులు, మహిళలు నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. అమరావతి కోసం తమ వ్యవసాయ భూములను త్యాగం చేశామని... ఇప్పుడు రాజధానిని ఇక్కడి నుండి తరలిస్తామంటే ఒప్పుకునేదే లేదంటూ దీక్ష చేపట్టారు. ఇలా సంవత్సర కాలంగా కొనసాగుతున్న దీక్ష రెండో సంవత్సరం దిశగా సాగుతోంది.  

ఇటీవలే అమరావతి రైతుల దీక్ష 500రోజులకు చేరుకోగా తాజాగా 550 రోజులకు చేరువయ్యింది. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రజలు సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాన్ని సమాచారం అందింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 
 


 

click me!