ఎగిరెగిరి గుండెలపై తన్ని, తలను గోడకేసి బాది... స్టూడెంట్ ను చితకబాదిన కసాయి టీచర్

By Arun Kumar PFirst Published Aug 29, 2021, 9:38 AM IST
Highlights

ఓ కసాయి టీచర్ తన విద్యార్థితో అమానుషంగా ప్రవర్తించాడు. అత్యంత దారుణంగా చితకబాదడంతో బాలుడు ఊపిరాడని స్థితిలో హాస్పిటల్ పాలయ్యాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: విద్యాబుద్దులు నేర్పే గురువులను తల్లిదండ్రులతో సమానంగా చూస్తుంటాం. విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టడానికి టీచర్లు రెండు దెబ్బలు వేస్తే పరవాలేదు. కానీ ఓ టీచర్ మాత్రం తన విద్యార్థితో అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. విద్యార్థిని ఎగిరెగిరి గుండెలపై తన్ని, తలను గోడకేసి కొట్టి పశువులా ప్రవర్తించాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... కభంపాటి మోహన్ సాయి అనే విద్యార్థి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని శ్రీనివాస్ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే కొంతకాలం క్రితం అతడు చదివే స్కూల్ బస్సు అద్దాలను గుర్తుతెలియని దుండగులు పగలగొట్టారు. ఇందుకు కారణం మోహన్ సాయిగా అనుమానించిన స్కూల్ డైరెక్టర్ బాపతు శ్రీనివాసరెడ్డి రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.  

అయితే సాయి తండ్రి మధు ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తుండటంతో అంత డబ్బు చెల్లించలేకపోయాడు. దీంతో పలుమార్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి డబ్బుల కోసం మధును వేధించాడు. అయినప్పటికి అతడు డబ్బులు చెల్లించలేకపోవడంతో సాయిపై కోపాన్ని పెంచుకున్నాడు.

read more  గుంటూరు: దట్టమైన అడవిలో ఒంటరిగా ఆడబిడ్డ... ఆదుకున్న దిశా యాప్

ఈ క్రమంలో శనివారం స్కూలుకు వెళ్లిన మోహన్‌సాయి తీవ్రమైన గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో వున్న కొడుకుని స్థానికంగా వున్న హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా వుందని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తనను చితకబాదినట్లు సాయి తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.  శ్రీనివాస్ రెడ్డి మాత్రం సాయి చెడు వ్యసనాలకు బానిసవడం వల్లే రెండు దెబ్బలు వేశానని... ఇది తప్పా అంటూ తన చర్యలను సమర్దించుకుంటున్నాడు. 
 

click me!