ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట టీడీపీ నేతలు పోరాటాలు చేస్తామంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఆలోచన చేయాలని సూచించారు.
విశాఖ రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. కేవలం 20 గ్రామాల కోసమే రాజధాని ఉండాలా? అని నిలదీశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖను ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాయని బొత్స విమర్శించారు. విశాఖ కేపిటల్ను వ్యతిరేకించిన వారెవరికీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకిస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని చెప్పారు. గతంలో మోడీ కేబినెట్లో ఉన్న అశోక్ గజపతిరాజుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తెలియదా? అని బొత్స ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ కూడా నిరసన వ్యక్తం చేస్తోందని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి, వాటిని నేరుగా ప్రజల ఖాతాల్లోకే బదిలీ చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.