
తూర్పుగోదావరి జిల్లాలో (east godavari district) ఆదివారం ఘోర రోడ్డు (road accident) ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం (i polavaram) కాలువ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జాగరంపల్లి గ్రామానికి (jagarampally) చెందిన కోడి రమేశ్, కోసు శేఖర్లు సీతపల్లిలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో గంగవరం (gangavaram) మండలం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, పండు అనే ఇద్దరు యువకులు రంపచోడవరం (rampachodavaram) నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఐ.పోలవరం కాలువ వద్ద ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో శేఖర్, రమేశ్, పండు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజబాబు తుదిశ్వాస విడిచారు. వీరంతా వ్యవసాయ కూలీలే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.