తాను టీడీపీలో ఉన్నందుకు సంతోషంగా ఉందని, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని రాయపాటి అన్నారు.
తిరుపతి: పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివ రావు ఉన్నారు టీడీపీలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆయన గురువారం ఉదయం వీఐపి ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయానకి వచ్చిన రాయపాటికి టీటీడీ అధికారులు స్వాగతం చెప్పి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని సాధనకు 50 రోజులుగా చేస్తున్న ఉద్యమం మరో వంద రోజులైన ఇదే రీతిలో కొనసాగుతుందని చెప్పారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రెండో కుమారుడు సిద్ధార్థతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన సిద్ధార్థ వివాహం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొదటి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.