తెలుగు బిడ్డ సింధు విజయంలో... ప్రపంచ క్రీడాపటంలో భారత్: జగన్, చంద్రబాబు అభినందనలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 02, 2021, 09:56 AM IST
తెలుగు బిడ్డ సింధు విజయంలో... ప్రపంచ క్రీడాపటంలో భారత్: జగన్, చంద్రబాబు అభినందనలు

సారాంశం

టోక్యో ఒలింపిక్స్2020 లో భారత దేశానికి రెండో పతకాని అందించిన తెలుగుతేజం పివి సింధుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సింధును అభినందించారు. 

అమరావతి: టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ''సింధు సాధించిన విజయం దేశానికే గర్వకారణం. ఆమె విజయంతో దేశం మొత్తం పులకిస్తోంది. ప్రపంచ క్రీడాపటంలో భారత్ పేరు నిలబెట్టిన సింధు తెలుగు బిడ్డ కావడం గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఔత్సాహిక క్రీడాకారులెందరికో మార్గదర్శిగా నిలవాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు కూడా కాంస్య పతకం సాధించిన పీవీ సింధూకు ఫోన్ చేసి అభినందించారు. సింధూపోరాట పటిమ దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఒలింపిక్స్ లో వరుసగా రెండుమార్లు పతకాలు సాధించిన సింధు దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని అన్నారు. సింధూ సాధించిన విజయం యావత్ భారతదేశానికే కాకుండా ప్రత్యేకించి తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు.

read more  టోక్యో ఒలింపిక్స్: నువ్వు భారతదేశానికే గర్వకారణం.. పీవీ సింధూకి రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ఏపీ యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందిస్తూ... ''సింధు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఒలింపిక్స్ లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుల కల. ఆ కలను నిజం చేసుకున్న సింధుకు హృదయపూర్వక అభినందనలు. వరుసగా తాను ఆడిన రెండో ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత్ ఘనకీర్తిని చాటిన సింధు తెలుగు బిడ్డ కావడం సంతోషించే విషయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

ఆదివారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన హి బింగ్జియావో పై 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సింధు భారత్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో పతాకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు... టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించడం ద్వారా సింధు భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.

PREV
click me!

Recommended Stories

Amaravati శాశ్వత రాజధాని.. Chandrababu చేసిన చట్టాన్ని Jagan మళ్లీ మార్చగలడా? | Asianet News Telugu
Tirumala Visit: తిరుమల శ్రీవారిసేవలో Former Supreme Court Judge Ashok Bhushan | Asianet News Telugu