జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం

Published : May 19, 2017, 03:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం

సారాంశం

జగన్ను ఏం చెప్పి ఆపాలో అధికారులకు, పార్టీ నేతలకు అర్ధం కాలేదు. దాంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపేమో విమానం ల్యాండ్ అవనున్నట్లు ప్రకటన వినబడింది. అసలే జగన్ ప్రయాణించాల్సింది ఏజెన్సీ ఏరియాలో. ఈమధ్య మావోయిస్టుల కదలికలు బాగా ఎక్కువయ్యాయి. ఆ విషయంలోనే అధికారులకు చెమటలు పడుతున్నాయి.

జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శుక్ర, శనివారాల్లో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటనుంది. అందుకనే ఈరోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా యంత్రాంగం జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. మరికొద్ది సేపటిలో విమానం ల్యాండ్ అవుతుందనగా ప్రోటోకాల్ సిబ్బంది కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో నుండి దిగిన డ్రైవర్ డోర్ లాక్ చేసారు. అయితే తర్వాత చూసుకుంటే తాళలు డ్రైవర్ వద్ద కనబడలేదు.

దాంతో అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఒకవైపేమో జగన్ ప్రయణిస్తున్న విమానం వచ్చే సమయం దగ్గరపడుతోంది. చుట్టుపక్కలంతా వెతికినా వాహనం తాళాలు కనబడలేదు. దాంతో ఏం చేయాలో సిబ్బందికి అర్ధం కాలేదు. వెంటనే పై అధికారులకు విషయాన్ని చేరవేసారు. విశాఖపట్నం నుండి జగన్ నేరుగా శ్రీకాకుళం వెళతారు కాబట్టి శ్రీకాకుళం ఎస్పీకి వివరించారు. అలాగే, విశాఖ కమీషనర్ కు చెప్పారు.

శ్రీకాకుళం నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనం రావాలంటే కనీసం గంటన్నర పడుతుందని ఎస్పీ చెప్పారు. విమానం వచ్చిన తర్వాత అంతసేపు జగన్ను ఏం చెప్పి ఆపాలో అధికారులకు, పార్టీ నేతలకు అర్ధం కాలేదు. దాంతో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపేమో విమానం ల్యాండ్ అవనున్నట్లు ప్రకటన వినబడింది. అసలే జగన్ ప్రయాణించాల్సింది ఏజెన్సీ ఏరియాలో. ఈమధ్య మావోయిస్టుల కదలికలు బాగా ఎక్కువయ్యాయి. ఆ విషయంలోనే అధికారులకు చెమటలు పడుతున్నాయి.

అదే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపిస్తున్నట్లు కమీషనర్ నుండి కబురందింది. విమానం ల్యాండ్ అయి, జగన్ బయటకు వచ్చే సమయానికి కమీషనర్ పంపిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా వచ్చేసింది. దాంతో అధికారులు, పార్టీ నేతలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వాహనం తాళాలు ఏమయ్యాయా? డ్రైవర్ తాను వాహనంలో నుండి బయటకు వచ్చి తాళాలను వాహనంలోనే ఉంచి డోర్ లాక్ చేసేసారు. మొత్తం మీద కథ సుఖాంతమైంది కానీ ప్రోటోకాల్ అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా బయటపడింది.

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | Asianet News Telugu
Roja Selvamani Fires On Kirrak RP | Kirrak RP Mahanadu Speech | Asianet News Telugu