
Pulivendula ZPTC By Elections: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైఎస్సార్సిపి నేతల మధ్య పరస్పర ఆరోపణలు, దాడులు జరుగుతున్నాయి. పలు చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానికంగా కాక రేపుతోంది. ఆగస్ట్ 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు స్థానికంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, సురేష్ కుమార్ రెడ్డి, అమరేశ్వర రెడ్డి పై దాడులు జరిగినట్లు పార్టీ నేతలు ఆరోపించారు.
గాయపడినవారికి వైద్యం అందించడంతో పాటు, దుండగులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలపై స్పందించిన వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి కలసి జిల్లా ఎస్పీకి మెమోరాండం అందజేశారు.
ఈ దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓటర్లలో భయం సృష్టించడమే లక్ష్యంగా, కుట్రపూరితంగా ఈ దాడులు జరిగాయని వైసీపీనేత సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ దాడిపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీకి రక్షణ లేకపోతే ప్రజలకు ఎలా ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై టిడిపి పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ వైఎస్సార్సిపి దుష్ప్రచారమే హింసకు కారణమన్నారు. తమ ప్రచారానికి అనుమతి ఇచ్చిన నల్లగొండవారిపల్లెలో వైఎస్సార్సిపి నేతలు తమ ఏజెంట్ను బెదిరించారనీ, ఆ పరిణామమే హింసకు దారి తీసిందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా టిడిపిలో చేరుతున్నారని స్పష్టం చేశారు.
జెడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం రాజుకుంటోంది. ఒకపక్క హింస, దాడులపై తీవ్ర ఆరోపణలు, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ పేరిట పోలీసులకు మెమోరాండ్లు, డిమాండ్లు చూస్తుంటే.. పులివెందుల రాజకీయం ఉద్రిక్తంగా మారినట్టు తెలుస్తోంది.