చంద్రబాబు రుషికొండ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. హైవే‌పై కాన్వాయ్ నిలిపివేత..

Published : May 05, 2022, 04:37 PM ISTUpdated : May 05, 2022, 04:39 PM IST
చంద్రబాబు రుషికొండ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. హైవే‌పై కాన్వాయ్ నిలిపివేత..

సారాంశం

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అయితే చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ టూరిజం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కూల్చిన రిసార్ట్స్ ప్రాంతం పరిశీలనుకు చంద్రబాబు నాయుడు రుషికొండకు బయలుదేరారు. అయితే చంద్రబాబు బృందం రుషికొండ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఎండాడ జంక్షన్ వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.  చంద్రబాబు కాన్వాయ్‌ను జాతీయ రహదారిపై నిలిపివేశారు. 

చంద్రబాబు రుషికొండ పర్యటనకు బయలుదేరడంతో.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురు టీడీపీ కార్యకర్తలను ఆటోల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. 

ఇక, అంతకుముందు విశాఖపట్నంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నలభై సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో చూస్తున్నానని చెప్పారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ అభివృద్ది గురించి ఏం చేయాలని ఆలోచిస్తే.. జగన్ మాత్రం విధ్వంసం ఎలా చేయాలో చేసి చూపించాడని మండిపడ్డారు. 30 ఏళ్లలో ఎవరూ చేయని విధ్వసం జగన్ రెడ్డి మూడేళ్లలో చేశారని మండిపడ్డారు. 

ప్రజావేదికతో కూల్చివేతతో మొదలైన విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు. గంజాయి రాష్ట్రానికి చిరునామాగా మార్చారని ఆరోపించారు. జగన్ అప్పులు చేసుకుంటూ పోతున్నారని.. అవి ఎవరూ కట్టాలని ప్రశ్నించారు. జగన్‌ది ఐరన్ లెగ్ అని.. అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. జగన్ ఊరికో సైకోను, రౌడీని తయారు చేశారని ఆరోపించారు. ఈ సైకోల నుంచి కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. సైకోలను అణచివేసి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆ శక్తి తనకు దేవుడు ఇచ్చాడని చెప్పారు. 

పార్టీకి ఆర్థికంగా సాయం చేసిన, క్షేత్ర స్థాయిలో పనిచేసిన, పార్టీకి ఆలోచన విధానంలో సహాయం చేసిన వారందరినీ పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. కార్యకర్తల, నాయకుల పనితనాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటామని చెప్పారు. భవిష్యత్ కోసం అందరం పనిచేద్దామని అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. 

‘‘ఏ నాయకుడు ఎన్ని ఇళ్లు తిరిగారో నేను కూడా మానిటర్ చేస్తాను. ఏ యూనిట్ ఎన్ని ఇళ్లు తిరిగిందనే వివరాలు సేకరిస్తాను. పనిచేసే వాళ్లకే పదవులు. నా చుట్టూ తిరగడం కాదు.. ప్రజల చూట్టూ తిరగాలి. నా చుట్టూ తిరిగితే పదవులు వస్తాయనే భ్రమను వీడాలి. ప్రజలతో ఉన్నవాళ్లకే పదవులు. రాబోయే 30 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉండేలా పనిచేయాలి. ఇది మనకోసం కాదు.. ఈ రాష్ట్రం కోసం’’ అని చంద్రబాబు చెప్పారు. 

కష్టాలు ఉంటాయని.. తన మీదే కేసులు ఉన్నాయని.. కేసులు ఉంటే ఏమవుతుందని ప్రశ్నించారు. ‘‘మనం ఏమన్నా బాబాయ్‌ని చంపామా..?, కోడి కత్తి డ్రామా చేశామా..?, లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బును దోచుకున్నామా..?, జైలుకు ఏమైనా వెళ్లామా..?.. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాలి..?, ఎందుకు భయపడాలి..?’’ అని అన్నారు. కేసులకు ఎవరూ భయపడవద్దని.. ఎన్ని కేసులుంటే అంత భవిష్యత్ అని అన్నారు. టీడీపీ అధికారంలో వచ్చాక వాటి సంగతి చూసుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు