ప్రేమిస్తున్నానని నమ్మించి.. లక్షలు కాజేసి.. ఆమె కారుతోనే ఉాడాయించి..!

By telugu news teamFirst Published Sep 21, 2021, 10:33 AM IST
Highlights

ఇంటీరియర్‌ పనులు చేసుకుంటున్న అతను.. తాను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. యువతి నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు.  
 

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె వద్ద నుంచి డబ్బులు గుంజేశాడు. ఆమెతో కారు కొనిపించి.. అదే కారుతో ఉడాయించాడు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు నల్లచెరువుకు చెందిన ఓ యువతి విప్రోలో ఉద్యోగం చేస్తోంది. గతేడాది ఓ చాటింగ్‌ యాప్‌ ద్వారా నల్లపాడు రోడ్డు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్‌రెడ్డితో ఆమెకు పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ విజయభాస్కర్‌రెడ్డి నమ్మబలికాడు. ఇంటీరియర్‌ పనులు చేసుకుంటున్న అతను.. తాను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. యువతి నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు.  

ఇద్దరం కలిసి స్మార్ట్‌ సర్వీసెస్‌ అనే కంపెనీ ఏర్పాటు చేద్దామని, పెళ్లయ్యాక ఇక ఎలాంటి ఇబ్బందులుండవంటూ ఆ యువతిని విజయభాస్కర్‌రెడ్డి నమ్మించాడు. ఈ క్రమంలో యువతికి సంబంధించిన పలు బ్యాంకు, క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు తీసుకునేలా చేసి, దాదాపు రూ.25 లక్షల వరకూ ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు.

అలాగే ఆమెతో ఓ కారును కొనుగోలు చేయించి 2021 మే 25న గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్‌కు భోజనానికి తీసుకెళ్లాడు. యువతిని ఏమార్చి ఆమె హ్యాండ్‌ బ్యాగులోని కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చి కారుతో పరారయ్యాడు. పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి.. విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అలాగే మరికొంత మంది యువతులనూ మోసం చేసినట్టు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు
 

click me!