చిక్కుల్లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్.. దళిత నేత భార్య ఫిర్యాదు..!

By telugu news teamFirst Published Sep 21, 2021, 9:56 AM IST
Highlights

పులి చిన్నాపై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి నిరసనగా అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు.

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన  నుంచి తమకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలని అమరావతి దళిత ఐకాస నేత పులి చిన్నా భార్య సువార్త తుళ్లూరు పోలీసులను కోరారు.  ఈ మేరకు ఆమె అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులతో కలిసి తుళ్లూరు సీఐదుర్గా ప్రసాద్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు.

పులి చిన్నాపై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి నిరసనగా అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం సీఐకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సువార్త మాట్లాడుతూ.. ఉద్దండరాయుని పాలెంలో అమరావతి ఉద్యమ శిబిరం ఏర్పాటు నుంచి ఎంపీ నందిగం సురేష్ వర్గం తమ కుటుంబంపై కక్ష పెంచుకుందని ఆమె చెప్పారు. కొన్ని రోజులుగా తాము బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నామన్నారు. రాత్రి పూట ద్విచక్రవాహనాలపై తమ ఇంటి చుట్టూ ఎంపీ అనుచరులు తిరుగుతూ భయపెడుతూ ఉన్నారన్నారు.

భూములు కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తిని ఎంపీ అనుచరులు పులి మోజెస్, పులి సురేష్, పులి మాణిక్యాలరావు, పులి దాసు రక్తం కారేలా కొట్టారన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో తన భర్తకు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలోనూ సరైన చికిత్స అందించడం లేదన్నారు. తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. వీరికి ఇతర ఐకాస నాయకులు కూడా అండగా నిలిచారు. 

click me!