
AP IT Minister Gudivada Amarnath: ఐటీ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ మరింత పటిష్టంగా ఎదగాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో ‘ఇన్ఫినిటీ వైజాగ్’ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి అమర్నాథ్తో పాటు పలువురు ఐటీ రంగ ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రత్యేకించి విశాఖపట్నంను బీచ్ ఐటీ డెస్టినేషన్గా, ఐటీ డొమైన్గా అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.
'ఇన్ఫినిటీ వైజాగ్' సమ్మిట్ ముగింపు రోజున ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైజాగ్ను ఐటీ రంగంలో అనేక స్థాయిల్లోకి తీసుకెళ్లేందుకు ఉన్న ప్రణాళికల గురించి వివరించారు. ''ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా వైజాగ్ బీచ్ ఐటీ రంగంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. విశాఖపట్నం నుండి సుమారు 25,000 మంది ఉద్యోగులు వివిధ ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే, విశాఖను ఐటీ హబ్ చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన మంత్రి.. త్వరలోనే అదానీ డేటా సెంటర్ను ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో పాటు ఇన్ఫోసిస్ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, AP ఇన్నోవేషన్ సొసైటీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో కలిసి IT అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ITAAP) ఈ సదస్సును నిర్వహించింది. ఈ ఈవెంట్లో రెండవ రోజు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరంపై దృష్టి సారించింది. ప్రస్తుత వృద్ధి గ్రాఫ్, స్టార్టప్ల కోసం అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థ సహా పలు అంశాలపై చర్చించారు.
మరోసారి మూడు రాజధానుల అంశం..
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు. ఏది ఏమైనా విశాఖ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై గత నవంబర్లో స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వం అయితే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నలు సంధించింది.