ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చెలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. దీనిని గుర్తించిన బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చెలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. దీనిని గుర్తించిన బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ సర్టిఫికేట్లతో న్యాయవాదులుగా కొనసాగుతున్నవారిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం త్వరలో ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. ఇందుకోసం తుళ్లూరు సీఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.
అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులతో చర్చించి ఈ కేసులో ముందుకు సాగనున్నట్టుగా తెలిపారు. నిందితులంతా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినవారేనని.. వీరు వేర్వేరు ప్రాంతాల నుంచి లా డిగ్రీ పట్టా పొందినట్టుగా సర్టిఫికెట్లు సమర్పించారని చెప్పారు. నాన్ బెయిలెబుల్ సెక్షన్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. ఇదిలా ఉంటే.. నకిలీ సర్టిఫికేట్లతో నకిలీ న్యాయవాదులుగా చెలామణి అవుతున్న కొందరు వారి ఎన్రోల్మెంట్ను సరెండర్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.