
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18న శాఖపరమైన విచారణ నిర్వహించనున్నారు.
ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సమాచారం పంపింది. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
ఇదే విషయమై ఆయనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కోర్టులను ఆశ్రయించారు. వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలపై శాఖపరమైన విచారణను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ విషయమై మాజీ డీజీపీలను విచారణకు రావాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో డీజీపీలుగా పనిచేసిన జేవీ రాముడు, సాంబశివుడు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూరులను రావాలని మెమోలు జారీ చేసింది. ఏపీ సచివాలయంలో విచారణ జరగనుంది.