ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: పోలైన 174 ఓట్లు, ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరంటే?

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  ఇవాళ  మధ్యాహ్ననికి  174 ఓట్లు పోలయ్యాయి.  నెల్లిమర్ల  ఎమ్మెల్యే  తన ఓటును వినియోగించుకోవాల్సి ఉంది. 

Google News Follow Us

అమరావతి: ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  ఒక్క ఓటు మినహా  మిగిలిన ఓట్లు  పోలయ్యాయి.   గురువారంనాడు ఉదయం 9 గంటలకు  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  ప్రారంభమైంది.   పోలింగ్  ప్రారంభమైన  కొద్దిసేపటికే  ఏపీ సీఎం  వైఎస్ జగన్  ఓటు వేశారు.  సీఎం జగన్ తర్వాత  మంత్రులు  ఓటు  హక్కును వినియోగించుకున్నారు.  తమకు  కేటాయించిన  ఎమ్మెల్యేలను  ఓటింగ్  కు హాజరయ్యేలా  మంత్రులు  జాగ్రత్తలు తీసుకున్నారు. 

వైసీపీ రెబెల్  ఎమ్మెల్యేలుగా  ఉన్న  ఆనం రామనారాయణరెడ్డి,  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ ఎన్నికలను పురస్కరించుకుని  టీడీపీ, వైసీపీలు  విప్ లు జారీ  చేశాయి.  

టీడీపీ ఎమ్మెల్యేలతో  కలిసి  చంద్రబాబునాయుడు  ఓటు హక్కును వినియోగిచుకున్నారు.  అసెంబ్లీని  బహిష్కరించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఆవరణలో  ఏర్పాటు  చేసిన  పోలింగ్  కేంద్రంలో  చంద్రబాబు  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఇవాళ మధ్యాహ్నం వరకు  174 మంది ఎమ్మెల్యేలు  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉమ్మడి విజయనగరం జిల్లాలోని  నెల్లిమర్ల  ఎమ్మెల్యే  అప్పలనాయుడు  పోలింగ్  కు హాజరు కాలేదు.  అప్పలనాయుడు  కుమారుడి వివాహం  కారణంగా అప్పలనాయుడు  ఓటింగ్ కు  హాజరు కాలేదని  సమాచారం.   వైసీపీ నాయకత్వం అప్పలనాయుడి కోసం చాపర్ ను  పంపింది.  ప్రత్యేకమైన చాపర్ లో  అప్పలనాయుడు  విజయవాడకు  చేరుకుంటారు.  విజయవాడ నుండి  ఆయన  నేరుగా పోలింగ్  కేంద్రానికి  చేరుకుని  తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 

టీడీపీకి  చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు  అస్వస్థతగా  ఉన్నప్పటికీ  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చైర్ లో  వచ్చి  ఓటు వేశారు. రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్  రెండు  రోజులుగా  అనారోగ్యంగా  ఉన్నారనే ప్రచారం సాగింది.  ఇవాళ  ఆయన  ఓటింగ్  కు హాజరయ్యారు