
కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు జాతీయ ఎస్టీ కమీషన్ నోటీసులు జారీ చేసింది. నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా పోలవరం నిర్వాసితులను తరలించడంపై జాతీయ ఎస్టీ కమీషన్ స్పందించింది. 15 రోజుల్లో వాస్తవిక నివేదికను ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమీషన్ ఆదేశించింది. లేని పక్షంలో సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.
కాగా, సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీలపై అధికారులకు కీలక సూచనలిచ్చారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏదో కట్టాం కదా? అన్నట్టు పునరావాస కాలనీలు కట్టకూడదని... కచ్చితంగా నాణ్యత పాటించాలని సీఎం సూచించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఈ ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వివరించారు అధికారులు.
Also Read:ఏదో కట్టాం కదా అన్నట్లుంటే...: పోలవరంపై సమీక్షలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పిల్వే పనులు దాదాపుగా పూర్తిచేశామని... 48 గేట్లలో 42 గేట్లు అమరిక, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని తెలిపిన అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే జర్మనీ నుంచి సిలిండర్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఎగువ కాఫర్డ్యాంలో అదివరకు ఉన్న ఖాళీలను పూర్తిచేశామన్నారు. అలాగే దిగువ కాఫర్డ్యాం పనుల పరిస్థితిని కూడా సీఎంకు వివరించారు అధికారులు.