ఆంధ్రప్రదేశ్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు, సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలు పనిచేస్తాయని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కరోనా వల్ల మార్చిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను ఏపీ ప్రభుత్వం పునరుద్దరించింది. కోవిడ్ ప్రభావం తగ్గడంతో పనివేళలు పునరుద్ధరిస్తూ సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కార్యాలయాలు, సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలు పనిచేస్తాయని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం సెలవు వుంటుందని వెల్లడించారు. సచివాలయం, విభాధిపతులు, కార్పోరేషన్ల కార్యాలయాలకు మాత్రం వారానికి రెండ్రోజులు సెలవు వుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి 5 రోజులే పనిచేస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Also Read:ఏపీ: 24 గంటల్లో కొత్తగా 2,498 కరోనా కేసులు.. గోదావరి జిల్లాల్లో తీవ్రత
అంతకుముందు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని... మరోసారి సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సీఎం ఆదేశించారు.