NTR Statue: దుర్గిలో తీవ్ర ఉద్రిక్తత, 144సెక్షన్... టిడిపి నాయకుడు చదలవాడ హౌస్ అరెస్ట్ (Video)

By Arun Kumar PFirst Published Jan 3, 2022, 10:03 AM IST
Highlights

పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించాడు గుంటూరు జిల్లా దుర్గి మండల వైసిపి నేత కోటేశ్వరరావు. సుత్తితో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి అతడు యత్నించాడు.

గుంటూరు: పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే టిడిపి (tdp) వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) విగ్రహాన్ని వైసిపి (YCP) నాయకుడొకరు ధ్వంసం చేసేందుకు యత్నించడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనకు నిరసనగా కేవలం గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి (TDP) శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉద్రిక్తంగా మారిన దుర్గి (durgi)కి వెళ్లడానికి సిద్దమైన నరసరావుపేట (narasaraopet) టిడిపి ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు (chadalavada arvindbabu)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
 
గుంటూరు జిల్లా (guntur district) మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గికి వెళ్ళడానికి అరవింద్ బాబు ప్రయత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయమే ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అరవింద్ వాగ్వాదానికి దిగారు.  

read more  NTR Statue: ఎన్టీఆర్ విగ్ర‌హంపై వైకాపా నేత దాడి.. ఎస్పీ ఆదేశాల‌తో నిందితుడి అరెస్టు

ఇక ఇప్పటికే దుర్గి బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కొడుకు, వైసిపి నాయకుడు కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ (vishal gunni) ఆదేశాలతో దుర్గి పోలీస్ స్టేషన్‌లో కోటేశ్వరరావుపై క్రైం నెంబరు 01/2022గా కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోటేశ్వరరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.    

Video

అయితే ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా ఇవాళ(సోమవారం) దుర్గి బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. దీంతో మండలకేంద్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో 144సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా  ముందుగానే  వ్యాపార సంస్థలు, స్కూళ్లు, దుకాణాలను మూయించారు పోలీసులు. 

ఇదిలావుంటే ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందిస్తూ అధికార మదంతో వైసీపీ నాయకులు అచ్చోసిన ఆబోతుల్లా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. 

Video

''దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని వైసీపీ నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేసిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 

read more  కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నం.. రామకుప్పంలో విగ్రహాల వివాదంపై బాబు స్పందన

వైసీపీ నాయకులు, కార్యకర్తలు అహంకారంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త ఎన్టీఆర్ విగ్రహం ద్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. అది కేవలం 6 అడుగుల విగ్రహం కాదు.. అఖండ తెలుగుజాతి ఆత్మగౌరవం, తెలుగోడి పౌరుషం అన్నారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయ్యేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

''ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన కాదు,  అధికార మత్తులో జరిగిన ఘటన. వైసీపీ నేతలు, ,కార్యకర్తలు అధికారమదంతో విర్రవీగి ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై దాడులు చేశారు, ఇప్పడు మహానుభావుల విగ్రహాలపై దాడులు చేస్తున్నారు. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది.  అధికారం ఉంది కదా అని హద్దు మీరితే చూస్తూ ఊరుకోం.  మాదైన రోజున వడ్డీ, చక్రవడ్డీ రెండూ కలిపి చెల్లిస్తాం'' అని అచ్చెన్నాయుడు వైసిపి నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. 
 

click me!