
శ్రీకాకుళం మండుతూ ఉంది.
ఈ మధ్య శ్రీకాకుళం ప్రజలు తిరగబడి తమ భూులను కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఇది రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు.
ఆ మధ్య ,ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఒక ధర్మల్ ప్లాంట్ పనులు కదలకుండా చేసి తరిమేశారు.
ఇపుడు నష్టపరిహారం చెల్లించకుండా వంశధార పనులు చేపడితే తాట వొలుస్తాం అంటున్నారు. సిపిఎం ప్రజల పక్షాలను ఉంటే, మంత్రి అచ్చన్నాయుడు ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులను, అధికారులను నడిపిస్తున్నారు. దీనిఫలితమే అదివారం నాటి రణం.
హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఆదివారం నాడు పోలీసులతో ఒక చిన్నయుద్ధమే చేశారు. సరైన నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా పోలీసులను చుట్టూర పెట్టుకుని, ప్రాజక్టు పనులు పనులు మొదలు పెట్టేందుకు పూనుకోవడం నిర్వాసితులకు ఆగ్రహం తెప్పించింది.
అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి కింజారపు అచ్చన్నాయుడు నిర్వాసితులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రజల తీవ్ర అసంతృప్తి కల్గించాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హిరమండలం, కొత్తూరు మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన వేలాది మంది స్రీలు పురుషులు కర్రలు పట్టుకుని యుద్ధానికి తరలివచ్చినట్లే రోడ్ల మీద కు వచ్చారు.
గొట్టా బ్యారేజీ కూడలి వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా గొట్టాబ్యారేజీ స్పిల్వే పనులను అడ్డుకున్నారు.
పొక్లయినర్ సహా నాలుగు వాహనాలను ధ్వంసం చేసి దహనం చేశారు. హిరమండలంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద తహశీల్దార్, ఎంపిడిఒ, విద్యాశాఖ కార్యాలయాల తాళాలు పగలగొట్టి, కిటికీల అద్దాలు, గార్లపాడు సమీపంలోని పటేల్ కంపెనీకి చెందిన 11 వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు.
అంతటితో ఆగలేదు.
పక్కనే ఉన్న మోదుగువలసలోని సోమా కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్, కంప్యూటర్లు, ల్యాబ్, స్టోర్ రూమ్ను ధ్వంసం చేసి భీభత్సం సృష్టించారు. రికార్డులు, పది ద్విచక్ర వాహనాలను దహనం చేశారు. ఆమదాలవలస, కొత్తూరు నుంచి వచ్చిన అగ్నిమాపకశాఖ వాహనాలను అడ్డుకున్నారు. నిర్వాసితులు వేల సంఖ్యలో ఉండటం, అంతా అగ్రహంతో అట్టుడికి పోతూ ఉండటంతో పోలీసులు ఏమీ చేయలేక ఈ దహన కాండను చూస్తుండిపోయారు.
దాదాపు కోటి రుపాలయ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల అంచనా వేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి నిర్వాసితుకు మద్దతు తెలిపారు.
అయితే, మంత్రి అచ్చన్నాయుడు ఈ దాడికి కారణం పట్టించుకోకుండా హంకరించారు. నిర్వాసితులమీద మెతక వైఖరి వద్దని, అందోళన దిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా అరెస్టు చేసి పనులు చేయిస్తామని అచ్చన్నాయుడు ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలను ఆశ్చర్య పరుస్తూ ఉంది.
చంద్రబాబు క్షమాపణ
వంశధార రైతుల పరిహారం విషయంలో అధికారులు విఫలమయ్యారని వారికి జరిగిన నష్టానికి క్షమాపణ చెబుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులను ఆ జిల్లాకు పంపి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దావోస్ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న ఆయన సోమవారం వెలగపూడిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంశధార ప్రాజెక్టు పరిధిలో భూ సేకరణ చేయాల్సి ఉందని, ఇందుకు గతేడాదే రూ.450 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులూ ఇచ్చామని చెప్పారు.