గాడ్సే వ్యాఖ్యల వివాదంపై వివరణ ఇచ్చిన నాగబాబు

By telugu teamFirst Published May 20, 2020, 2:00 PM IST
Highlights

నాథూరామ్ గాడ్సేపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించడంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వివరణ ఇచ్చారు. తనను అర్థం చేసుకోవాలని, నాథూరామ్ నేరాన్ని తాను సమర్థించలేదని ఆయన అన్నారు.

హైదరాబాద్: నాథూరామ్ గాడ్సే పై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వివరణ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వివరణ ఇచ్చారు. తాను నాథూరాం చేసిన నేరాన్ని సమర్థించలేదని, నాథూరాం వెర్షన్ కూడా జనాలకు తెలియాలని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. 

"దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్ల కన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం" అని నాగబాబు అన్నారు..

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణిస్తూ సినీనటుడు, జనసేన నాయకుడు నాగబాబు చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి స్పందించిన విషయం తెలిసిందే. నాగబాబు వ్యాఖ్యలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆమె తప్పు పట్టారు. 

కులమతాలు వేరైనా దైవం ఒక్కటేనని, ఎన్ని తరాలైనా జాతిపతి ఒక్కడేనని ఆమె ట్వీట్ చేశారు. 130 కోట్ల మంది భారతీయులకు మహాత్ముడు ఒక్కడేనని ఆమె ట్వీట్ చేశారు. 

ఈశ్వర్ అల్లా తేరేనామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్... నాకు కూడా... అని గాడ్సే ఇప్పుడు బ్రతికుంటే.. ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్థించేవాడు, మహాత్మా మన్నించండి అని విజయశాంతి ట్వీట్ చేశారు. 

గాడ్సే నిజమైన దేశభక్తుడని, అతని దేశభక్తిని శంకించడానికి వీలు లేదని నాగబాబు ట్వీట్ చేశారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసి కూడా గాడ్సే అనుకున్నది చేశాడని ఆయన అన్నారు. గాడ్సే వాదనను అప్పట్లో ఏ మీడియా కూడా చెప్పలేదని, అప్పటి ప్రభుత్వానికి లోబడి మీడియా పనిచేసిందని ఆయన అన్నారు. నాథూరామ్ గాడ్సే పుట్టిన రోజు సందర్బంగా నాగబాబు ఆ ట్వీట్ చేశారు.

click me!