తన కూతురును వైఎస్ జగన్ పై పోటీకి నిలపనున్నట్టు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రకటించారు. తాను బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే చంద్రబాబునాయుడు అనుమతివ్వాల్సి ఉందన్నారు.
విజయవాడ: చంద్రబాబునాయుడు అనుమతిస్తే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్పై తన కూతురు పోటీ చేస్తోందని ఎమ్మెల్యే జలీల్ఖాన్ ప్రకటించారు. ఈ మేరకు తనకు అనుమతివ్వాలని చంద్రబాబునాయుడును కోరారు.
మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రానికి సైతాన్లా తయారయ్యాడని జలీల్ఖాన్ విమర్శించారు.
తనను తాను రక్షించుకొనేందుకుగాను వైఎస్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వైఎస్ జగన్ పై పోటీ చేసేందుకు తన కుటుంబ సభ్యులు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడు అంగీకరిస్తే జగన్పై తన కూతురును పోటీకి దింపుతానని జలీల్ఖాన్ ప్రకటించారు.
మరోవైపు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన కూడ జలీల్ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. అయితే ఈ రెండు ప్రతిపాదనలనపై చంద్రబాబునాయుడు అనుమతి ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు.
టీడీపీలో చేరిన తర్వాత మంత్రి పదవి వస్తోందని భావించారు. అయితే రాజకీయ సమీకరణాలు, కేబినెట్ లో సామాజిక వర్గాల కూర్పును దృష్టిలో ఉంచుకొని జలీల్ఖాన్ కు కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే నామినేటేడ్ పదవి మాత్రం జలీల్ఖాన్ కు దక్కింది.
సంచలన ప్రకటనలు చేస్తూ జలీల్ ఖాన్ వార్తల్లో నిలుస్తుంటారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించి జలీల్ ఖాన్ ప్రసార సాధనాల్లో పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే.