
ముద్రగడ వ్యవహారశైలి పట్ల కాపు సామాజిక వర్గంలోనే అసంతృప్తి పెరుగుతున్నతున్నట్లు సమాచారం. పేరుకు కాపు సమాజిక వర్గం పేరే అయినా జరిగేదంతా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటమేనని పలువురు కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడ చేపడుతున్న ఏ కార్యక్రమం కూడా కాపు సామాజిక వర్గం నేతలతో కూర్చుని నిర్ణయించింది కాదని పలువురు నేతలు ఆక్షేపిస్తున్నారు. కాపు నేతలు ‘ఏషియా నెట్’తో మాట్లాడుతూ ముద్రగడ వ్యవహారం మొత్తం మొదటి నుండి ఏకపక్షమేనని వ్యాఖ్యానించారు.
ముద్రగడ తాజాగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు కూడా సామాజిక వర్గంలోని నేతలతో చర్చించి నిర్ణయించింది కాదన్నారు. తనచుట్టూ ఉండే నలుగురుతో చెప్పి కార్యక్రమాలు రూపొందించుకోవటం ముద్రగడకు మొదటి నుండి అలవాటేనన్నారు.
కాపు సామాజిక వర్గం కోసమన్నపుడు సామాజికవర్గంలోని ప్రముఖులను, నేతలను భాగస్వాములను చేస్తే ఎటువంటి కార్యచరణ అయినా మరింత బలోపేతమవుతుందని చెప్పినా ముద్రగడ ఏనాడు పట్టించుకోలేదని అంటున్నారు.
సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని వ్యక్తిగత ప్రతిష్ట పెంకుకోవటానికి తప్ప ఆయన చేపడుతున్న కార్యచరణ మరింకెందుకూ పనికిరాదని కాపు నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఆయన చుట్టూ చేరిన వాళ్లల్లో కాపు సామాజికవర్గంలో పెద్దగా ప్రాముఖ్యత, పట్టు లేని వారే చేరినట్లు కూడా పలువురు ఆక్షేపిస్తున్నారు.
దశాబ్దాల తరబడి ముద్రగడ రాజకీయంగా మరుగున పడిపోయారని కాబట్టి మళ్ళీ వెలుగులోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే ఏకపక్ష కార్యాచరణను ప్రకటిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాలన్నా, యువతను బలోపేతం చేయాలన్నా అందరితో చర్చించి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తే బాగుంటుందని పలువురు కాపు నేతలంటున్నారు.
పూర్తిస్ధాయిలో పనిచేయటానికి ముందుకు వచ్చే యువత ఉన్నా వారిని ఉపయోగించుకోవటం లేదన్నారు. సామాజిక వర్గంలోని అందరినీ భాగస్వాములను చేయటంలో ముద్రగడ విఫలమవుతున్న కారణంగానే ఆయన చేపడుతున్న కార్యాచరణకు పెద్దగా సానుకూల ఫలితాలు రావటం లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.