నైజీరియన్ మోసగాడిలా... వైసిపి పేరిట నకిలీ వెబ్ సైట్: చంద్రబాబుపై విజయసాయి

By Arun Kumar PFirst Published Feb 23, 2021, 2:52 PM IST
Highlights

విజయనగరంలో బహిరంగంగానే టిడిపి నేతలు కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా? అంటూ ఎంపీ విజయసాయి విరుచుకుపడ్డారు. 

అమరావతి: పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిందని... అదే పరిస్థితి  మున్సిపల్ ఎన్నికల్లోనూ ముందుగానే ఊహించిన టిడిపి దౌర్జన్యానికి పాల్పడుతోందని వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏం చేసినా మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి ఇంతకంటే పరాభవం తప్పదన్నారు విజయసాయి. 

''పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని అద్దంలో చూపించేశారు ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో  చేసేది లేక రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. విజయనగరంలో బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?'' అంటూ ట్విట్టర్ వేదికన చంద్రబాబు, ఎస్ఈసి నిమ్మగడ్డపై విజయసాయి విరుచుకుపడ్డారు. 
 
''ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఓటమిని సమీక్షించుకుంటాం అని అంటారు ఎవరైనా. నాలుగో విడత 41.7% ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెబ్తూనే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసాడు చంద్రబాబు. ఇతను మారడు. తను భ్రమల్లో జీవిస్తూ అందరిని అందరినీ అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడు'' అని ఎద్దేవా చేశారు. 

''పంచాయతీ తుది దశ పూర్తయ్యే సరికి తుప్పలు పట్టుకుపోయాడు తుప్పు నాయుడు. ఈ నకిలీ నాయుడు ప్రచారం చూసి జనమే గుణపాఠం చెప్పారు. వైఎస్సార్‌ సీపీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ పెట్టి నైజీరియా మోసగాళ్ల ముఠా స్థాయికి దిగజారాడు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి ఇంతకంటే పరాభవం తప్పదంటూ'' విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

''రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయని ఎలక్షన్ కమిషన్, పోలీసు శాఖలు వెల్లడించాయి. జగన్ గారి 20 నెలల సంక్షేమ పాలనకు కృతజ్ణతగా దక్కిన అఖండ విజయం ఇది. టిడిపి అడ్రసు గల్లంతయి గ్రామాలన్ని వన్ సైడుగా మారడం వల్ల అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోయింది'' అని  విజయసాయి పేర్కొన్నారు. 

click me!