ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. పదవి నుంచి తొలగించడమంటే అది వేరుగా ఉంటుంది.. అది ప్రజలే చూస్తారు. నన్ను ఎవరూ తొలగించలేరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణం రాజు సవాలు విసిరారు. గత కొంతకాలంగా జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు. పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్గా ఉన్న రఘురాజును తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సెల్ఫీ వీడియో రూపంలో స్పందించిన ఆయన.. తనను ఎవరూ తొలగించలేదని.. తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు.
‘మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి నన్ను తొలగించాలని స్పీకర్కు వైసీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు. అది ఏడాది పదవి కాలమని మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారు. నా పదవి కాలం అయిపోయింది కాబట్టి.. దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని పార్టీ లెటర్ ఇచ్చింది. రెడ్లుకు పదవులు ఇవ్వడం అయిపోయింది కాబట్టి.. ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారు. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారు. అది తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నది’ అని ఎంపీ రఘురాజు అన్నారు.
‘అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్పైనే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను. దమ్ముంటే జగన్ ఎన్నికలు వెళ్లాలి. ఇది అతిశయోక్తితో చెబుతున్నది కాదు. త్వరలో నాపై అనర్హత వేటు వేయిస్తామని పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. పదవి నుంచి తొలగించడమంటే అది వేరుగా ఉంటుంది.. అది ప్రజలే చూస్తారు. నన్ను ఎవరూ తొలగించలేరు.. వారికి (వైసీపీ పెద్దలకు) సవాల్ విసురుతున్నాను’ అని రఘురాజు చెప్పుకొచ్చారు.