
ఈ మధ్యకాలంలో మోసగాళ్లు ఎక్కువయ్యారు. మన అత్యాశ, దురాశ..వాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. వీళ్ల మాయలో పడి ఈజీ మనీ కోసం ఆశపడితే.. అంతే ఈజీగా అగాధంలో కూరుకపోవడం గాయం. ప్రధానంగా డబ్బు ఆశ చూపించి అమాయకులు, అత్యాశపరులను టార్గెట్ చేస్తున్నారు. తాము మోసపోయామని బాధితులు తెలుసుకునే లోపే డబ్బుతో పరార్ అవుతున్నారు. ఇలాంటి ఘరానా మోసమే ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రూ. 2,000 నోట్ల మార్పిడి పేరుతో ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. ఈ క్రమంలో అందిన కాటికి దండుకుని పరార్ అయ్యింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలో రేగిడి ఆముదాలవలసకు ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. రూ.90లక్షల విలువైన నగదు ఇస్తే.. రూ. కోటి విలువైన రూ.2వేల నోట్లు ఇస్తామని ఆశ చూపింది. ఆ ఆఫర్ కు టెంప్ట్ అయిన ఇద్దరు అమాయకులు మోసగాళ్ల వలలో పడ్డారు. ఈజీగా మనీ వస్తుందని వాళ్లు చెప్పినట్టు గుడ్డిగా నమ్మేశారు. రేగిడి ఆముదాలవలసకు చెందిన ఇద్దరు.. ఉన్నది లేనివి అమ్ముకుని.. వారి కూడా సరిపోకపోతే.. ఇతరుల దగ్గర అప్పు తెచ్చి మరీ డబ్బు ఆ మోసగాళ్లకు అప్పచెప్పారు.
తీరా కట్ చేస్తే.. డబ్బులు దండుకున్న ఆ కేటుగాళ్లు పత్తా లేకుండా పరార్ అయ్యారు. దాంతో తాము మోసపోయాని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశారు. నగదుతో మరో ఇద్దరు పారిపోయారు.స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మన అత్యాశే మోసగాళ్లకు వరంలా మారుతోందనీ, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.