జనసేనతో పొత్తుకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు వున్నా లేనట్లే వుందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా తాము పవన్ని కోరామని.. ఆయనే స్పందించలేదని మాధవ్ వ్యాఖ్యానించారు.
జనసేనతో పొత్తు వున్నా లేనట్లే వున్నామన్నారు ఏపీ బీజేపీ నేత మాధవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమతో జనసేన కలిసి రాలేదన్నారు. అయినాసరే గతం కంటే తమ ఓట్ల శాతం పెరిగిందని మాధవ్ అన్నారు. పవన్ తమతో కలిసి రావడం లేదనేదే తమ ఆరోపణ అంటూ ఆయన కామెంట్ చేశారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. కానీ తాము మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని మాధవ్ స్పష్టం చేశారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు వుందని ప్రజలు నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా తాము పవన్ని కోరామని.. ఆయనే స్పందించలేదని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన వైసీపీని ఓడించమని చెప్పింది కానీ, బీజేపీని గెలిపించమని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీల అధ్యక్షులు కలిసే వున్నామని చెబుతున్నా.. కార్యకర్తలు మాత్రం కలిసిలేరని మాధవ్ స్పష్టం చేశారు. కలిసి కార్యక్రమాలు చేద్దామని.. అప్పుడే పొత్తు వుందని మాకూ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కలిసి కార్యక్రమాలు చేయాల్సి వుందన్నారు. పొత్తుల గురించి హైకమాండ్ చూసుకుంటుందని.. తాము వైసీపీతో వున్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మాధవ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంతో మే నెలలో ఛార్జ్షీట్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: రాజకీయాలు క్రికెట్ ఆటలాంటివే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై సోము వీర్రాజు
ఇదిలావుండగా మాధవ్ వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో వైసీపీకి జనసేన-బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్ధతు ప్రకటించారని.. కానీ మాధవ్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదని విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు.